Monday, June 23, 2025

వారాహీ నవరాత్రులు

 శ్రీ గణేశాయ నమః 

                              శ్రీ శ్యామలాయై నమః 
                              శ్రీ లలితాయై నమః 
                              శ్రీ వారాహీ దేవ్యై నమః 

ఆషాఢ పాఢ్యమి నుండి ఆషాఢ నవమి వరకు వారాహీ నవరాత్రులుగా ప్రసిద్ది 
వారాహీ స్వరూపం ఉగ్రదేవత గా ప్రసిద్ధి . ఆ అమ్మ వారిని సాధారణంగా గృహాలలో 
పండితుల యొక్క ఆధ్వర్యం లో మాత్రమే పూజించటం ఉత్తమమైన మార్గం . 
ఆ తల్లి ని అందరూ ధ్యానించటానికి అనువుగా దూర్వాస మహర్షి అమ్మ వారి లోకాన్ని అమ్మ వారి రూపాన్ని తానూ దర్శించి మనకు దర్శింప చేశారు . 
 
 ఆయన చూపిన మార్గంలో మనమూ ధ్యానం చేసి అమ్మ వారి కృపకు పాతృలమవుదాం . ముందుగా అమ్మ వారి లోకాన్ని దర్శిద్దాం 
 వారాహీ  దేవి నివశించే లోకం చుట్టూ ఉన్న ప్రాకారం లేలేత పచ్చగడ్డి కాంతులతో
ప్రకాశించు మరకత మణులతో నిర్మితమై ఉంటుంది.     


ఆ ప్రాకారాన్ని ధ్యానించటం ద్వారా స్థిరమైన సంపద శ్రేయస్సు పుష్టి పొందగలం . 

ఆ ప్రాకారం లోపల బంగారు తాటి చెట్ల వనం . ఆ వనం పచ్చని కాంతులతో ప్రకాశిస్తుంది . ఆ వనం లో మరకత మణులతో నిర్మితమై రెప రెప లాడుతున్న 
జెండాలతో కూడిన నివాస గృహంలో 

నూఱు బంగారు స్తంభాలతో కూడిన బంగారు వేదికపై , ఒక బంగారు పీఠం 
ఆ పీఠం పై బంగారు రెక్కలతో కూడిన పద్మం . ఆ పద్మం యొక్క నడిమి భాగాన 
కరుగుతున్న బంగారపు కాంతులతో మెరిసిపోవు కర్ణిక (పూల పుప్పొడి ఉండే ప్రాంతము )

ఆ కర్ణిక పై బిందు ఆవరణం దాని చుట్టూ త్రికోణం దాని చుట్టూ వర్తులాకార ఆవరణం దాని చుట్టూ వేయి దళాలతో కూడిన పద్మం ఆ పద్మం చుట్టూ  రెండు 
వృత్తాకార ఆవరణలు 

ఆ ప్రదేశంలో నూట పది అక్షరాల సమూహంతో సేవించబడు ఆ కలహంసి యగు 
వారాహీ దేవి సంచరిస్తున్నది 
   
ఈ విధంగా అమ్మవారిలోకాన్ని ధ్యానించి ఆ తదుపరి అమ్మ వారి రూపాన్ని దర్శిద్దామిలా 


వరాహ ముఖం తో విరాజిల్లుతూ  పద్మముల  వంటి కనులతో 
ఆ పద్మములకు శత్రువైన చంద్రుని శిరము పై అలంకారంగా 
చేసుకుని  లేత బంగారు కాంతులీను దేహంతో   సంధ్యా సమయపు 
సూర్యుని ఎఱుపు రంగుతో శోభిల్లు వస్త్రములు ధరియించి 

తన  చేతులలో హల (నాగలి ) ముసల (రోకలి) శంఖ ,చక్ర, పాశం,
అంకుశం ధరించి  ఒక చేతితో అభయ ముద్ర ను మరొక చేతితో 
వర ముద్ర ను ప్రదర్శిస్తూ 
సంపూర్ణమైన దయతో నిండిన కనులు కలిగి , సమస్త దేవతా స్త్రీల చేత   అర్చించబడి 
హృదయంపై కుంకుమ కాంతులతో ప్రకాశిస్తూ అతి సుకుమారమైన సన్నని నడుముతో ఆ తల్లి ఒప్పారుతుంటుంది . 

ఆ తల్లి మూఢులకు దూరముగా వుంటూ , ఆర్తులకు శుభములు కలిగించు ఆర్తాలి 
కోరుకున్న కోరికలు ప్రసాదించు వార్తాలి . 
 ఆ అమ్మ వారికి నాలుగు దిక్కులలో ఉన్మత్త భైరవి , స్వప్న భైరవి , తిరస్కరిణి దేవి, కిరిపదా అనే నలుగురు  ప్రధాన శక్తులు వుంటారు 
అలాగే అష్ట భైరవులు , పదిమంది హేతుకులు సంచరిస్తూ వుంటారు . 
అలా ఆ తల్లి పరివారాన్ని తలచుకుని అమ్మ వారిని ద్వాదశ నామాలతో స్మరించుకుంటూ 
ఈ స్తోత్రం తో ధ్యానం చేసుకుందాం 
శ్రీ మాత్రే నమః 
 పంచమీ  
దండనాథా  
సంకేతా   
సమయేశ్వరి 
 సమయసంకేతా 
వారాహీ 
 పోత్రిణీ 
 శివా  
వార్తాలి  
మహాసేనా 
ఆజ్ఞాచక్రేశ్వరి 
 అరిఘ్ని
 శ్రీ మాత్రే నమః  

సదనే తత్ర హరిన్మణి-
-సంఘటితే మండపే శతస్తంభే ।
కార్తస్వరమయపీఠే
కనకమయాంబురుహకర్ణికామధ్యే ॥

బిందుత్రికోణవర్తుల-
-షడస్రవృత్తద్వయాన్వితే చక్రే ।
సంచారిణీ దశోత్తర-
శతార్ణమనురాజకమలకలహంసీ ॥ 

కోలవదనా కుశేశయ-
-నయనా కోకారిమండితశిఖండా ।
సంతప్తకాంచనాభా
సంధ్యారుణచేలసంవృతనితంబా ॥ 

హలముసలశంఖచక్రా-
-ఽంకుశపాశాభయవరస్ఫురితహస్తా ।
కూలంకషానుకంపా
కుంకుమజంబాలితస్తనాభోగా ॥

ధూర్తానామతిదూరా-
-వార్తాశేషావలగ్నకమనీయా ।
ఆర్తాలీశుభదాత్రీ
వార్తాలీ భవతు వాంఛితార్థాయ ॥ 

తస్యాః పరితో దేవీః
స్వప్నేశ్యున్మత్తభైరవీముఖ్యాః ।
ప్రణమత జంభిన్యాద్యాః
భైరవవర్గాంశ్చ హేతుకప్రముఖాన్ ॥ 

No comments: