Monday, April 5, 2010

మీకు తెలియనిది ఏమున్నది

నారాయణా  మీకు  తెలియనిది  ఏమున్నది

కాల స్వరూపులు , కర్మసాక్షి అయిన  ప్రత్యక్ష సూర్యనారాయణులు

జీవిని  బంధించు త్రిగుణ స్వరూపము మీరే

నరులను తమ చిత్తం వచ్చినట్లు ఆడించు మాయకు యజమానులు

 మీకు  తెలియని  విషయమేమున్నది

 అయినా మీ  పాద పద్మముల  చెంత నిలబడి  నా  వేదన  విన్నవించుకుంటున్నాను

కొంచెం  కరుణా స్వభావం  తో  వినండి

 ఒక్కసారి  నా  జీవితాన్ని వెనుదిరిగి చూస్తే  కాస్త లోకజ్ఞానం తెలసిననాటి  నుండి నేటి వరకు నన్ను వీడక దహించి వేస్తున్న దావాగ్ని నుండి పుట్టిన కొన్ని ఫలాలు

 

తొలినాళ్ళలో మదురమైన ఊహలలో  విహరింపజేసి నేడు  సాధారణ  దాహార్తి  కూడా

తీర్చుకోవటానికి  పనికిరాని ఎండమావుల  పాల్జేసినావు

 

ఆనాడు  దైవ  సమానులైన  గురువు పట్ల కూడని కార్యాన్ని చేయించి

నేడు  ఆ  కర్మ ఫలాన్ని బహు చక్కగా  అనుభవింపచేస్తున్నావు  .

నాకు  తెలుసులే  కృష్ణా  నీకు  అర్ధమయ్యిందని  మరి  వివరంగా చెప్పించాలనుకోకు  

 చదువును పక్కన పెట్టి పెద్దల నమ్మకాన్ని వమ్ము చేసి నాడు సాగించిన ఘనకార్యపు ఫలితం నేడు నమ్మి చేయి పుచ్చుకున్నవారికి తీరని వేదనగా మారి పరిహాసించుచున్నది పరంధామా

 

పరమపవిత్రమైన ధామంలో  నీ పాద పద్మముల చెంత కనులు ముసుకుపోయి ప్రవర్తించిన ఫలం నేడు నా జీవితాన్ని అపహాస్యం చేస్తున్నది కృష్ణా

 

ఏనాటి కర్మఫలమో నేడు ఇతరుల ధనం పట్ల తీరని ఆసక్తిని కలిగించి

అగ్ని చేత ఆకర్షించబడిన మిణుగురులు దహించుకుపోయినట్లుగా నా  జీవితాన్ని

దగ్ధం చేస్తున్నది  రామా

 

ఇంకా నాడు  రైలు ప్రయాణంలో వృద్దుని  పట్ల  నా తీరు , తల్లి  తండ్రుల  పట్ల  బాధ్యతారాహిత్య  ప్రవర్తన  

 

ఇవన్ని  నారాయణా నీ  కృపతో  నే  సంపాదించిన  ఆస్తులు

ఇక చాలు చాలు  ముకుంద  వీటి  భారమిక  నే మోయలేను

 

నా ఆస్తులన్నిటిని  సర్వ హక్కులతో  నీకు ధారాదత్తం చేస్తున్నాను

బలి  నుండి  మూడడుగుల నేల కోరి తృప్తి పొందిన  వామనా

నా ఈ  కొద్దిపాటి  ఆస్తులను  కూడా  ప్రేమతో  స్వీకరించు


--
OM NAMO BHAGAVATE VAASUDEVAAYA


Saturday, February 27, 2010

ఆనందకరమైన హొలీ

వెండికొండపై  తెల్లని  వర్ణంలో  ప్రకాశించు  

సదాశివుడు సకల శుభాలు నోసగుగాక  

 

నల్లనివాడు పద్మనయనంబులవాడగు నారాయణుడు

సదా మనలను గాచుగాక

 

ఎర్రని వర్ణంతో  శోభిల్లు  సర్వమంగళను సగభాగంగా  కలిగి

వున్న శంకరుడు సర్వమంగళకరమగు  జీవితమొసగుగాక

 
పసుపుపచ్చని పసిడి  పీతాంబరదారియగు  విష్ణువు  అష్టైశ్వర్యాలు

ప్రసాదించునుగాక

 

ఆకుపచ్చని  ప్రకృతికాంతను తన  ఆధీనంలో వుంచుకున్న పశుపతి

మనసుకు  ఆహ్లాదమొసగుగాక

 

నీలవర్ణపు తారకలను  బ్రమింపజేయు పాలకడలి అలలబిందువులతో

నిండిన దేహం కల  నాగ శయనుడు మనలకు తన పాదపద్మముల కడ చోటునోసగుగాక

 
కాషాయాంబరధారి   కాశీ విశ్వనాధుడు  మనకు  మోక్షమొసగును   గాక
 
అందరికి  ఆనందకరమైన   హొలీ  శుభాకాంక్షలు


--
OM NAMO BHAGAVATE VAASUDEVAAYA


Friday, February 19, 2010

సద్గురు


                                    మహా గణపతయే నమః

 

సద్గురు సాయి లీలలను ప్రత్యక్షంగా చవిచూసిన ఒక భక్తుని అనుభవాల సంపుటికి ఆ భక్తుని కుమారుడు ఆంగ్లంలో అక్షరబద్ధం చేయగా  వాటిని  చదివి 

సంబ్రమాశ్చర్యాలకు  లోని  తెనుగించ  సంకల్పించి  చేసిన  చిన్ని  ప్రయత్నమిది  

 

ముంబై  నుండి బయలుదేరిన మన్మాడు రైలు నాసిక్ రోడ్ స్టేషన్ దాటి పరుగులుపెడుతుంది .  ఉన్నత శ్రేణికి చెందిన బోగీలో  కొందరు  పెద్ద  మనుషులు పేకాటతో  కాలక్షేపం  చేస్తున్నారు .

 ఇంతలో  తెల్లని వస్త్రాన్ని తలకు చుట్టుకున్న ఫకీరు ఒకడు వారిలో ఒక పెద్దమనిషి ముందు భిక్ష కోసం చేయి చాచాడు .
 అతని పరిస్థితికి జాలి  పడిన ఆ పెద్ద మనిషి ఖరీదైన తన కోటు జేబులోకి చేయి పోనిచ్చి వెండి రూపాయి తీసి అతనికి  ఇచ్చి ప్రక్కకు తొలగమని ఆటకు అడ్డురావద్దని  చెప్పాడు

 ఆ నాణెం  తీసుకున్న ఫకీరు దానిని పరికించి చూడసాగాడు . ఎందుకంటే 1908 కాలం  నాటి  విషయం  కదా . ఆ రోజుల్లో  రూపాయి అంటే చాలా  పెద్ద  మొత్తం

అది గమనించిన ఆ  పెద్ద మనిషి  నీవేమి  సందేహించనవసరం  లేదు . అది   స్వచ్చమైన  వెండితో  చేయబడిన జార్జ్  5 చిహ్నం కలిగి ,1905 వ  సంవత్సరంలో   చేయబడినది , ఇక  ప్రక్కకు తప్పుకో  అని  గట్టిగా చెప్పాడు . ఆ  ఫకీరు అక్కడనుండి   ప్రక్కకు  వెళ్ళిపోయాడు

మరునాడు  వేకువ ఝాముకు షిర్డీ చేరుకున్నారు . ఆ ప్రాంతాన్ని బాగుగా తెలిసియున్న  అతని  కుమారుడు , భార్య  సూచనలను  పాటిస్తూ ఆ పెద్దమనిషి స్నానాదికాలు పూర్తి చేసి   పూజా సామాగ్రితో ద్వారకామాయి  లోకి  అడుగుపెట్టారు.

ఆ పెద్దమనిషి , అతని భార్య బాబా ను చూసి ఆయన పాదాలకు నమస్కరించారు . అప్పుడు   బాబా అతనితో  " ఓ  పెద్దాయనా ! మా  అమ్మ , సోదరుడు ఎంతో  నచ్చ  చెప్పినమీదట   కాని , ఇక్కడకు  రావటానికి  నీవిష్టపడలేదు నన్ను గుర్తుపట్టావా " అని  అడిగారు.

 లేదు  అన్నది అతని సమాధానం.

 పోనీ దీనిని గుర్తించావా తాను ధరించిన కఫ్నీ జేబు లోనుండి జార్జ్ 5 బొమ్మ ముద్రించిన   వెండి రూపాయి తీసి చూపిస్తూ అడిగారు బాబా .

 తెల్లబోవటమే సమాధానమయ్యింది . రాత్రి  రైలులో జరిగిన ఘటన గుర్తుకు రాసాగింది.

 రాత్రి నీదగ్గరకు వచ్చిన ఫకీరు నేనే  సందేహనివృత్తి  చేసారు బాబా  

 ఒక్కసారిగా దిగ్బ్రమకు లోనయ్యారు . వెంటనే  తేరుకుని రాత్రి తన ప్రవర్తనకు  క్షమాపణ   కోరి, బాబా పాదాలకు నమస్కరించారు .  బాబా గురించి తన భార్య కుమారుడు  చెప్పిన   మాటల్లో ఎంతమాత్రము అసత్యం  లేదు . వీరు నిజంగా దేవుని యొక్క దూత  అని  మనసులో  తలంచసాగారు  
 ఆ  పెద్దమనిషిలో పరివర్తన జరిగిపోయింది . ప్రార్ధనా సమాజం నుండి విడివడి బాబా యొక్క  సేవకు తన జీవితం అంకితం చేసారు. ప్రతి  ముఖ్యమైన పని బాబాను సంప్రదించిన   తరువాతే మొదలు పెట్టేవారు . బాబా పట్ల అమితమైన ప్రేమభావం పెంచుకున్నారు అంతేకాక బాబాకు నూలు వస్త్రం  పంపిస్తుండేవారు . దానితో బాబా కఫ్ని   కుట్టించుకునేవారు.  పెట్రోమాక్స్ దీపాన్నికూడా ఇచ్చారు . సాయంత్రపు    వేళ ద్వారకామాయిలో దానిని  ఉపయోగించేవారు . షిర్డీ లో  ఉన్నప్పుడు ఆ దీపం    తానే వెలిగించి  నిర్దిష్టమైన  ప్రాంతంలో ఉంచేవారు

భగవంతుడు సర్వవ్యాపి . ఆయన ఎప్పుడైనా ఎ  రూపంలోనైన సంచరించగలరు

ఇందుకు తార్కాణాలు అనేకం . దత్తాత్రేయులు వారు కూడా అనేక రూపాలు ధరించి  భక్తుల   వద్ద భిక్ష స్వీకరిస్తుంటారు ఇప్పటికి కూడా . ఆయన ఎప్పుడైనా  ఎ  రూపంలోనైన  రావచ్చు . కొన్నిసార్లు  కుష్టువ్యాధి గ్రస్తుని వలె వచ్చి భక్తులను పరీక్షించేవారు . అందుకే  భిక్ష  కోరి   వచ్చిన వారిని  భగవత్ స్వరుపులుగా  ఆదరించవలె  .



--
OM NAMO BHAGAVATE VAASUDEVAAYA


Tuesday, February 16, 2010

ముకుంద మాల

ముకుంద మాల
 
ఓ  ముకుందా   
శ్రీవల్లభ  వరదా  భక్తప్రియా  దయాసాగరా
నాధా , జగన్నివాసా , శేషశయనా 
ప్రతి  దినం  అమృతమయమైన  ని  నామాలను
స్మరించు  వివేచన  కలిగించు
 
దేవకీనందన  దేవాధిదేవ  జయము  జయము
వృష్టి  వంశ  ప్రదీప  జయము  జయము
నీల మేఘశ్యామ  జయము  జయము
ధర్మ రక్షక  జయము  జయము
 
ఓ  ముకుందా
శిరము  వంచి  ప్రణమిల్లి  మిమ్ములను  యాచిస్తున్నాను     
నా  రాబోవు  జన్మలెట్టివైనను  మి  పాద పద్మములను
మరువకుండునటుల  మి  దయావర్షం  నాపై  అనుగ్రహించుము
 
ఓ  హరి !
 
కుంభిపాక  నరకములనుండి , జీవితపు  ద్వంద్వముల  నుండి
రక్షించమనో ,
మృదువైన లతల  వంటి  శరీరంతో  కూడిన  రమణీమణుల పొందుకోరి
నిన్ను  ఆశ్రయించలేదు
 చావు  పుట్టుకల  చక్రబంధం  లో  చిక్కుకున్న  నా  మదిలో
జన్మ  జన్మకు  ని   పాదపద్మములు  స్థిరంగా  వుండునట్లు
అనుగ్రహించుము  చాలు
 
ఓ  దేవాధి దేవా !
నేనెంత   నిరాసక్తుడైనప్పటికి  పూర్వ కర్మల  వాసనా బలం  చేత
ధర్మాచరణ , భోగ  భాగ్యాల  అనురక్తి  నను  విడకున్నవి 
కాని  నేను  నిన్ను  కోరే  గొప్పదైన  వరం  ఒక్కటే , జన్మ  జన్మలకు
కూడా  ని  చరణారవిన్దాలు   సేవించుకునే  భాగ్యం  కల్పించు .
 
ఓ  నరకాసుర  సంహార !
 
దివి , భువి  లేక  నరకం  నీవు  నాకు  ప్రసాదించే 
నివాసమేదైనప్పటికిని , మరణ  సమయంలో
శరత్కాలపు  నిర్మల  సరోవరంలో  వికసించిన
నవ  కమలములవంటి  ని  పాదములు  నా  మనో  నేత్రంలో  నిలుపు  చాలు
 
 

కృష్ణా ! నా  మనసనే  సరోవరంలో

 రాజహంసవలె  విహరించు . ప్రాణ దీపం

 కోడగడుతున్నవేళ   కఫావాత పిత్తాలతో  

 నిండిన  జ్ఞానేంద్రియాలు  నిన్నెలా  తలచగలవు

 కనుక  ఇప్పటినుండే  నీ  పాద  పద్మాలను

 నా  హృదయంలో  నిల్పెద

 
తుమ్మెదలను ఆకర్షింపచేయు పూల మకరందం వోలె
మా  మనస్సులను  రంజింపజేయు   మందస్మిత వదనార  విందా

పరమ  సత్యమైనట్టివాడ  నంద గోప తనయా  నారదాది  

మునింద్రులచే  కీర్తించబడు  హరీ  ఎల్లప్పుడూ  నిన్నే   తలచెదను

  

నీ  కర  చరణాలనే  పద్మాలతో  నిండి

చల్లని  వెన్నల  బోలు  చూపులను  ప్రసరించు నీ  

చక్షువులే  చేప  పిల్లలుగా  కల  హరిరూపమనే  

సరోవరం లో  కొద్ది  జలాన్ని  త్రాగి  జీవనయానపు  

బడలిక  నుండి  పూర్తిగా  సేద తీరెదను   

 

కలువ పూల వంటి  కనులతో , శంఖు చక్రాల  తో  

విరాజిల్లు  మురారి  స్మరణ    ఓ మనసా ! ఎన్నటికి  

మరువకు  అమృతతుల్యమగు  హరి  పాద పద్మాలను  

తలచుటకన్నను  తీయని తలంపు  మరి  లేదు  కదా

 

ఓ  అవివేకపూరితమైన మనసా ! నీ   స్వామి  శ్రీధరుడు  చెంత  నుండగా  

మృత్యువు గూర్చి  నీవొనరించిన  పాపకర్మల ఫలితాన్ని గూర్చిన చింత  ఏల ?.

ఇంకను  ఆలస్యమేల?   తొందరపడు  అత్యంత  సులభుడైన   నారాయణుని 
 పాదాలను నీ  భక్తి  తో  బంధించు  నీ  బంధనాలు  తెంచుకో

 

 

జనన మరణాలనే  రెండు  ఒడ్డుల  కూడిన  సాగరం లో  

వచ్చిపోయే  కెరటాల  వలె  నానా  జన్మల  పాలై

రాగ  ద్వేషాలనే  సుడిగుండంలో  చిక్కుకుని

భార్యా  పుత్రులు , సంపదలనే  వ్యామోహపు  మకరాల

కోరలకు  చిక్కి  చితికిపోతున్న  నాకు  మత్స్యరూపధారి   హరీ  నీవే   దిక్కు . 

దాటశక్యం కాని  సంసార  సాగరం  చూసి

దిగులు  చెందకు  ఆందోళన  విడుము

నిర్మల  ఏకాగ్రచిత్తంతో  ధ్యానించు

నరకాసుర సంహారి  నావలా  మారి  నిన్నావలి  తీరం  చేర్చగలడు

 

కోరి  వరించిన  భార్య  తత్ఫల  సంతానం

సంపదలనే  మూడు  భంధనాలపై  మదనుడి

మోహబాణపు   తాకిడికి  పెంచుకున్న  వ్యామోహంతో

జనన , జీవన  మరణాలనే  మూడు  సరస్సులలో  పలుమార్లు

మునకలేస్తున్న   నాకు  ముకుందా  నీ   భక్తి  అనే  పడవలో

కొద్ది  చోటు  కల్పించు  

 
 ముకుందా!  నీ  కడగంటి  చూపు తో

పృథ్వి  ధూళి  రేణువు  సమమవ్వును

అనంత  జలధి  ఒక్క  బిందు  పరిమాణమయ్యే  

బడబాగ్ని  చిన్న   అగ్నికణం  గా  గోచరిస్తుంది

ప్రచండమైన  వాయువు  చిరుగాలి  లా  ఆహ్లాదపరుస్తుంది

అంచులేరుగని   ఆకాశం  చిన్న  రంధ్రమై  చిక్కపడుతుంది

సమస్త  దేవతా  సమూహం  బృంగ  సమూహాలను  మరిపిస్తుంది

కృష్ణా  సమస్తము  నీ  పాద  ధూళి   లోనే  ఇమిడియున్నది  కదా  

 

 

యాజ్ఞావల్క్యాది   మహర్షులచే  తెలియజేయబడిన

జరా  వ్యాధి  మరణాల  నుండి  ముక్తి  కలిగించు

దివ్యోషధం  జనులారా  మన  హృదయాలలో  అంతర్జ్యోతి

వలె , కృష్ణ  నామం  తో  ఒప్పారుచున్నది . ఆ  నామామృతాన్ని

త్రావి  పరమపదం  పొందుదాం

 

దురదృష్టమనే  అలలతో  కూడిన  సంసార సాగరంలో

అటునిటు  త్రోయబడుచున్న నరులార!  చిరుమాట  వినండి

జ్ఞానఫలం  కోసం  నిష్ఫల యత్నాలు  వీడి 
ఓం  నారాయణా  నామజపం  తో  ముకుందుని  పాదాల  మోకరిల్లండి

  

ఎంత  అవివేకులము  సుమీ  !

పురుషోత్తముడు  ముల్లోకాలకు  అధిపతి

శ్వాసను  నియంత్రించిన  మాత్రాన  అధినుడగునట్టివాడు  

స్వయంగా  మన  చెంతకు  రానుండగా ,

 తనవన్ని  మనకు  పంచనుండగా

అధములైనట్టి  రాజులను  యజమానులను

అల్పమైన  కోర్కెల   కోసం  ఆశ్రయించుచున్నాము

 

 

ముకుళిత  హస్తాలతో  వినమ్రతతో  వంగిన  శిరస్సుతో

 రోమాంచిత  దేహంతో  గద్గద  స్వరంతో  కృష్ణ  నామాన్ని  

పదే  పదే స్మరిద్దాం  సజల  నేత్రాలతో  నారాయణుని  వేడుకుందాం

ఓ  సరోజ పత్ర  నేత్రా  …..ఎర్ర  తామరలను  బోలిన  నీ  పాదద్వయం  నుండి

జాలువారు అమృతం  సేవించుచు మా జీవనం  కొనసాగించు  భాగ్యం  కలిగించు

కృష్ణా  నీ పాదధూళి  తో  పునీతమైన

శిరము  జ్ఞానదీపమై  ప్రకాశించుచున్నది

 హరిని కాంచిన కనులు  మాయ పొరలు వీడి

తారలవలె  కాంతులీనుతున్నవి  

 మాధవుని చరణారవిందాలపై లగ్నమైన మది

పండు వెన్నెల వలె , పాంచజన్యపు  తెల్లదనం వలె  స్వచ్ఛమై ఉన్నది

 నారాయణుని  గుణగణాల  కీర్తన తో  తడిసిన  నాలుక

సుధారస  ధారలు  కురిపించుచున్నది

  

ఓ  నాలుకా ! కేశవుని కీర్తనలు  ఆలాపించు

ఓ  మనసా ! మురారి  స్మరణలో  మునకలేయుము

ఓ  చేతులారా ! శ్రీధరుని  సేవలో  నిమగ్నమవ్వుడు

ఓ  చెవులారా  ! అచ్యుతుని  లీలలను  ఆలకింపుడు   

ఓ  కనులార  ! కృష్ణుని  సౌందర్య  వీక్షణలో  రెప్పపాటు  మరచిపోండి

ఓ  పాదములారా ! ఎల్లప్పుడూ  హరి  ఆలయమునకే  నను  గోనిపొండి

ఓ  నాశికా  ! ముకుందుని  పాద ద్వయంపై  నిలచిన  పవిత్ర  తులసి  సువాసనలను

                  ఆస్వాదించు

ఓ  శిరమా  ! అధోక్షజుని  పాదాల  ముందు  మోకరిల్లు

  

ముకుందా ! నీ పాదస్మరణ  లేని

 పవిత్ర నామ  ఉచ్చారణ  అడవిలో  రోదన  వంటిది

వేదకార్యాల  నిర్వహణ  శారీరిక  శ్రమను  మాత్రమే  మిగుల్చును

యజ్ఞాయాగాదులు  బూడిదలో  నేయి  కలిపిన చందము

పుణ్యనది  స్నానం  గజస్నానం  వలె  నిష్ఫలము

కనుక  నారాయణా  నీకు  జయము  జయము

  

మురారి  పాదాలకు  పీటమైనట్టి   నా  మదిని  

మన్మధుడా ! వీడి  మరలి పొమ్ము

హరుని  కంటిచుపులో  కాలిపోయిన  నీకు

హరి  చక్రపు  మహోగ్ర  తీక్ష్ణత తెలియకున్నది

 

శేషతల్పం పై పవళించు నారాయణుడు  మాధవుడు

దేవకీ దేవి ముద్దుబిడ్డ  దేవతా సముహలచే

నిత్యం కొలవబడువాడు సుదర్శన చక్రమును

సారంగమను వింటిని ధరించినట్టివాడు

లీలచే  జగత్తును ఆడించువాడు  జగత్ప్రభువు

శ్రీధరుడు  గోవిందుడు అగు హరి స్మరణ  మనసా

ఎన్నటికి  మరువకు . స్థిరంగా  హరిని  సేవించుటకన్నను  

నీకు  మేలు కలిగించు దారి మరేదిలేదు

 

  మాధవా  ! నీ పాదపద్మాలపై  నమ్మిక లేనివారి  వైపు

                                               నా  చూపులు  తిప్పనివ్వకు

నీ  కమనీయ గాధా విశేషాలు తప్ప ఇతరములేవి నా చెవి చేరనియకు

నిన్ను  గూర్చిన  ఆలోచన లేనివారి తలంపు నాకు రానీయకు

నీ  సేవా భాగ్యమునుండి  ఎన్ని జన్మలెత్తినా నను దూరం చేయకు

ఓ  లోకనాధా  ! నీ  పాదదాసుల  యొక్క  సేవక  సమూహానికి

సేవకులైన  వారి  సేవకులకు  నన్ను  సేవకుడిగా  పుట్టించు

మధు  కైటభులను  నిర్జించిన  హరీ  ! నీ నుండి  నే కోరు వరము

నా  జీవితానికి అర్ధమొసగు ఫలము అదియే  సుమా

 

ఓ  నాలుకా  ! చేతులు  జోడించి వేడుకోనుచుంటిని

తేనే  వలె చవులురించు పరమ సత్యమైన పలువిధముల

నారాయణ  నామామృతాన్ని  పదే  పదే  చప్పరించు

మనసుకు ఆహ్లాదాన్ని కలిగించు

 
నారాయణా  ! నీ  పాద పంకజమునకు  నా  నమస్సులు

నారాయణా  ! సదా  నీ  పూజలో  పరవశించేదను  

నారాయణా  ! నీ  నిర్మల  నామాలను నిత్యం  స్మరించెదను

నారాయణా  ! నీ  తత్వాన్నే  ధ్యానించేదను  

 

శ్రీనాధా   నారాయణా  వాసుదేవా

శ్రీకృష్ణా  భక్త ప్రియా  చక్రపాణి

శ్రీ పద్మనాభ  అచ్యుతా  కైటభారి

శ్రీరామ  పద్మాక్షా  హరీ  మురారీ

 

 అనంత  గోవర్ధనగిరిధారీ   ముకుందా  కృష్ణా

గోవిందా  దామోదరా  మాధవా

ఎట్టివారలమైనను ఎ ఒక్క  నామమైనను

స్మరించవచ్చు  కాని  ఏది  స్మరించలేక

 ప్రమాదముల వైపు  పరుగెడుచున్నాము


 

భక్తుల  అపాయాలనే సర్పాల పాలిట  గరుడమణి

ముల్లోకాలకు  రక్షామణి  

గోపికల కనులను ఆకర్షించు చాతకమణి

సౌందర్య  ముద్రామణి  

కాంతలలో  మణిపూస యగు రుక్మిణి  కి  భూషణ మణి

అగు దేవ శిఖామణి  గోపాలా !  మాకు  దోవ చూపు

 

  శత్రువులను  నిర్మూలించు మంత్రం

  ఉపనిషత్తులచే  కీర్తించబడిన మంత్రం

  సంసార భందాలను త్రెంచివేయు మంత్రం

  అజ్ఞాన అంధకారం తొలగించు మంత్రం

  సకల ఐశ్వర్యాలు  ప్రసాదించు మంత్రం

  ఈతి బాధలనే  పాముకాట్లనుండి  రక్షించు మంత్రం

  ఓ  నాలుకా  ! పదే  పదే  జపించు  జన్మసాఫల్యత నొసగు   

  మంత్రం  శ్రీకృష్ణ మంత్రం

 

 వ్యామోహం నుండి చిత్తశాంతి  నొసగు  ఔషధం  

ముని పుంగవుల చిత్త  ఏకాగ్రత నొసగు  ఔషధం

దానవ  చక్రవర్తులను నియంత్రించు  ఔషధం

ముల్లోకాలకు  జీవమొసగు  ఔషధం

భక్తులకు హితమొనర్చు  ఔషధం

సంసార భయాలను తొలగించు  ఔషధం  

శ్రేయస్సు నొసగు  ఔషధం  

ఓ మనసా  ! తనవితీరా  ఆస్వాదించు

శ్రీకృష్ణ  దివ్యౌషధం

 

ఓ మనసా ! నారాయణుని కీర్తించు

ఓ శిరమా ! ఆయన పాదాల మోకరిల్లు

ఓ హస్తములార ! ప్రేమతో అంజలి ఘటింపుడు  

ఓ ఆత్మా! పుండరీకాక్షుడు నాగాచలం పై

శయనించివున్నవాడు , పురుషోత్తముడు

పరమసత్యమైనట్టి  నారాయణుని శరణాగతి కోరుము

 

ప్రభు జనార్ధనుని లీలామయగాధలు విను తరుణాన

దేహం రోమాంచితం కానిచో , నయనాలు ఆనంద

భాష్పములనే సుమాలను రాల్చకున్నచో మనసు  పరవసించకున్నచో

అట్టి  నా జీవితం  వ్యర్ధమే కదా

 

ఈ శరీరం అనేక మార్పులకు లోనవుతుంది

కండరాలు అరిగి నొప్పికి గురి అవుతాయి

ఏదో ఒకరోజు పండుటాకులా రాలిపోతుంది

ఓ  అమాయకుడా ! నయం చేయలేని నానా రకాల మందుల

వెదుకులాట మానుకో  దివ్యమైన అమృతమయమైన  

శ్రీకృష్ణ  నామౌషధాన్ని  మనసారా  త్రాగుము

 

 మనుష్యులెంత  చిత్రమైనవారు

అమృతాన్ని వదిలి  విషాన్ని  పానం చేస్తున్నారు

నారాయణ నామస్మరణ  మాని  నానారకముల

వ్యర్ధ పలుకులను ఆసక్తి  తో  చెప్పుచున్నారు

 
బంధు మిత్రులు  నన్ను  త్యజించినారు

పెద్దలు గురువులు  నన్ను నిరాకరించినారు

అయినప్పటికీ  పరమానందా  గోవిందా  !

నీవే  నాకు  జీవితము

 

ఓ  మనుజులారా ! ఎలుగెత్తి  సత్యం  చాటుతున్న

ఎవరు అనుదినం  రణం లోను మరణం లోను

ముకుందా  నరసింహా  జనార్ధనా  అని  నిరంతరం

ధ్యానిస్తువుంటారో  వారు  తమ  స్వకోర్కెల  గూర్చి

చింతించటం  రాయి  వలె  ఎండుచెక్క  వలె  వ్యర్ధం

 

చేతులెత్తి  బలమైన  గొంతుకతో  చెబుతున్న

ఎవరు  నల్లని  గరళము  వంటి  జీవితము  నుండి

తప్పించుకోజూస్తారో   అట్టి  జ్ఞానులు  ఈ  భవసాగరాన్ని

తిరస్కరించుటకు నిత్యం  ఓం నమో నారాయణాయ  అను 
 మంత్రం వినటమే  తగిన  ఔషధం  

 

ఎట్టి  కారణం చేతనైనను  ఒక్క  నిమిషమైనను

కృష్ణుని  దివ్య పాదారవిందాల స్మరణ మానిన

అట్టి  క్షణమే  ప్రియ మిత్రుల బంధువుల గురువుల

పిల్లల ఆక్షేపణలతోను, నీచపు ఆలోచనల విహారంతోను

గాలి వార్తలతోను మనసు  విష పూరితమగును  

కనుక  కృష్ణా  నీ  ప్రేమామృతం  చాలు

 

కృష్ణుడు జగద్గురువు  కృష్ణుడు  సర్వలోక రక్షకుడు

కనుక ఎల్లప్పుడూ కృష్ణుని పాదాలని ఆశ్రయించేదను  

లోకం లోని మన శత్రువులను నిర్జించి కృష్ణుడు మనలను  

కాపాడును .కృష్ణా  నీకు నమస్కారము

కృష్ణుని నుండే అన్ని  జగములు పుట్టుచున్నవి

జగములన్నియు  క్రిష్ణునిలోనే  ఇమిడియున్నవి

కృష్ణా ! నేను  నీ  దాసుడను

ఎల్లప్పుడూ  నా  రక్షణాభారం వహించు

 

హే  గోపాలక  ,హే  కృపా జలనిదే ,హే  సింధు కన్యా పతే
హే  కంసాంతక  ,హే  గజేంద్ర  కరుణాపారీణా , హే  మాధవ
హే  రామానుజ  ,హే  జగత్త్రయ గురో  ,హే  పుండరీకాక్ష

హే  గోపీజన వల్లభా  నాకు  తెలుసు నీవు తక్క వేరెవ్వరు లేరు

కనుక ఎల్లప్పుడూ నన్ను రక్షించు

 

క్షీర సాగరుని కుమార్తె నీ అర్ధాంగి

ముల్లోకాలు సృష్టించు బ్రహ్మ నీ కుమారుడు

నిన్ను గూర్చిన స్తుతులే  పవిత్ర వేదాలు

సకల దేవతా సమూహము నీ సేవక పరివారము

ముక్తి  నోసగుటయే నీవు  ఆడు  ఆట

దేవకీ  నీ  తల్లి

శత్రువులకు అభేద్యుడగు అర్జునుడు నీ మిత్రుడు

ఇంత  మాత్రమే నాకు తెలుసు  ( నీవు తప్ప తెలుసుకోదగినది వేరేది  లేదు కదా )

 

 ముకుందునకు  ప్రణమిల్లుటయే  శిరస్సు యొక్క ఉత్తమ కర్తవ్యము

పూవులతో అర్చించుటయే  ప్రాణశ్వాస యొక్క  కర్తవ్యము

దామోదరుని  తత్వ చింతనమే మనసు యొక్క  కర్తవ్యము

కేశవుని కీర్తనమే  వాక్కు యొక్క  కర్తవ్యము

 

ఓం నమో నారాయణా అని స్మరించినంత మాత్రాన

పాపులు కూడా ఉద్దరించబడుతున్నారు  . అట్టిది

పూర్వ  జన్మలలో  ఎన్నడు  నారాయణుని  నామ స్మరణ  

చేయకుంటినేమో  ఇప్పుడు  గర్భావాసపు  దుఖాన్ని భరించవలసివచ్చే


హృదయ మధ్యమున  పద్మపత్రంలో  

అవ్యయుడు అనంతుడు అయిన విష్ణువు ని నిలిపి

సదా ధ్యానించు వారలకు సకల భయాలు

తొలగి విష్ణుపదం సన్నిహితమవుతున్నది

 

ఓ  హరీ ! ఓ పురుషోత్తమా ! ఓ విష్ణు

నీవు దయా సముద్రుడవు

పాపులకు మరల మరల ఈ  భవసాగరమే  గతి అగుచున్నది

నీ దయావర్షం  నాపై కురిపించి

నన్ను ఉద్దరించు ముకుందా

  

పాల కడలిలో అలల తుంపరలు దేహాన్ని తాకుతూ

నీలాకాశాన తారకలు వలె మెరుయుచుండగా

శేషతల్పం మీద సుఖాసీనుడవైన  మాధవా

మధుసంహారీ నీకివే నా మనఃపూర్వక  ప్రణామములు

 
కృష్ణ  కృష్ణ  అన్న నామాలు చాలు  

జీవిత కర్మఫలాలు దూరంగా నెట్టి వేయబడటానికి

ముకుందుడి  పై ఎనలేని ప్రేమభావమున్న

సిరి సంపదలు  మోక్ష ద్వారం  అందుబాటులో వుంటాయి

 

నా  మిత్రులు జ్ఞాన మూర్తులు

కవిత్వ సామ్రాజ్యంలో రారాజులు

ద్విజోత్తములు . నేను కులశేఖర చక్రవర్తి  ని

ఈ  పద్య  కుసుమాలు  పద్మాక్షుని  చరణాంబుజములకు  

భక్తి ప్రపత్తులతో  సమర్పితం


--
ఓం  నమో  భగవతే  వాసుదేవాయ


--
OM NAMO BHAGAVATE VAASUDEVAAYA


Saturday, January 30, 2010

నీలిమేఘ శ్యామా …..


నీలిమేఘ శ్యామా …..

 

కృష్ణుడి పేరు …………దట్టమైన నల్లమబ్బు వంటి వర్ణం కలవాడా

 ఏమిటి  మేఘానికి  భగవంతుడికి  సంబంధం  

 

నీటితో  నిండియున్న మబ్బు నల్లగా వుంటుంది . అది  తనలోని నీటి ధారలను

వర్షించగానే తెల్లగా తేలిపోతుంది . ఇక ఇవ్వటానికి నాదగ్గర ఏమి లేదే  అని

వెలవెలబోతుంది

 అలాగే భగవంతుడు  కూడా  …..మేఘంలో  నీరు ఉన్నట్లే  కృష్ణుడిలోను  

కృపాజలం నిండుగా  వుంటుంది . ఆయన కూడా మనపై  దయావర్షాన్ని కురిపిస్తాడు

 

 మేఘం కొండలలో వర్షిస్తుంది . అక్కడ  కురిస్తేనే ఆ నీరు

నదిగా మారి మనకు ప్రయోజనం కలిగిస్తుంది

 అందుకే  కృపాజలనిది  వెంకటనాధుడు  ఏడుకొండలపై కొలువుండి  మనపై

తన దయావర్షం కురిపిస్తున్నాడు

 
 భక్తులు  రెండు  రకాలు ……

ఏదైనా  ప్రత్యేకమైన కోరికలతో భగవంతునకు నమస్కరించేవారు

ఎటువంటి  కోరికలు కోరకుండానే నమస్కరించుకునేవారు

 వీరిలో ఎవరు తెలివైనవారు  ? ఎ  కోరికలు కోరని వారు

మన  పరిజ్ఞానం  ఎంత ? మనకు నిజంగా ఏది అవసరమో  మనకు  తెలుసునా

మనం  కోరే  కోరిక  నిజంగా  మనకు  పూర్ణానందం  కలిగిస్తుందా

 అదే  మనమేమి  కోరకుంటే మనకు ఏది అవసరమో తనే నిర్ణయించుకుని

వెంకటనాధుడు  మనపై  దయావర్షం  కురిపిస్తాడు

 అదే  మనం  కోరుకుంటే  అంత  వరకే  ఇచ్చి , అయ్యో  వీడికి  ఎంతో  ఇద్దామనుకున్నాను  

కాని  నాకింతే  చాలని అంటున్నాడే  అని నీరు వెలసిన మేఘం లా ఆ  దయాసముద్రుడు

వెలవెల బోతాడు

మరి మనం ఆయన కృపాజలంలో సంపూర్ణంగా తడిసి ముద్దయ్యేందుకు ప్రయత్నిద్దామా !

(పెద్దల అనుగ్రహభాషణల ఆధారంగా)


--
OM NAMO BHAGAVATE VAASUDEVAAYA


Monday, January 25, 2010

ఇవి కావా నీ ఆనవాళ్ళు

శుక్లపక్షపు చవితి నాటి చంద్రరేఖ
పున్నమి నాటి పండువెన్నెల
ఇవి కావా నీ ఆనవాళ్ళు
 
మార్గశిరోదయాన  గులాబి బుగ్గపై నిలచిన మంచుముత్యం    
మంచు పరదాలను చీల్చుకుని నులి వెచ్చగా తాకే పసిడికిరణం 
ఇవి  కావా నీ ఆనవాళ్ళు
 
చైత్ర కాలపు చమట గంధాన్ని చిదిమే మల్లెల పరిమళం
వుడికించే వేడిమిలో  ఊరించే మామిడి  మాధుర్యం
ఇవి కావా నీ ఆనవాళ్ళు
 
వసంతోదయాన  కోకిల  కుహుకుహులు
లేలేత చిగుళ్ళతో పరవసింపచేయు ప్రకృతి పచ్చదనం  
ఇవి  కావా  నీ  ఆనవాళ్ళు
 
ఝురి విప్పిన మబ్బు తునకకు ప్రతిగా పురి విప్పిన  మయూరపు  సోయగం
కొండవాలున  జాలువారుతున్న జలకన్య  జాణతనం
ఇవి  కావా  నీ  ఆనవాళ్ళు

--
OM NAMO BHAGAVATE VAASUDEVAAYA


Monday, January 11, 2010

అసలేం జరుగుతుంది-2

అసలేం జరుగుతుంది-2
రింగులు తిరుగుతున్న పొగల తెరలు

బంగారురంగు పానీయంతో నిండి వున్న అందమైన గ్లాసులు

చుట్టూ  కోలాహలం

 

అంతలోనే ఎగసిపడిన ఆనందంతో

 ఒరేయ్ ఇన్నేళ్ళు  ఏమైపోయావురా  ఓ  కేక

 నామాలు తెల్సుకోవటానికి ఒక నిమిషం సమయం పట్టినా

రూపాలు పోల్చుకోవటానికి అట్టే సమయం  పట్టలేదు

ఎన్నాళ్ళకెన్నాళ్ళకు   ……..5 వ  తరగతి నుండి పదోతరగతి వరకు

కలసి చదివిన బాలసన్యాసులు

అవునుమరి  గురుకులం ………తాడికొండ గురుకుల బాలుర విద్యాలయం

 అప్పటి  క్లాస్ మేట్స్   ఇప్పుడు  ఇలా  

సుమారు  20 సంవత్సరాల  తరువాత

అవును …………..

సరిగా  మే  9, 1990…………

 

ఒక వైపు తుఫాన్ కుదిపేస్తుంది

 మరోవైపు ……..జగదేకవీరుడు  అతిలోక సుందరి  చిత్రం విడుదల

 ఈరెంటిని  మించిన  ఉత్కంట  ……… మా  పదో తరగతి ఫలితాల ప్రకటన

 ఒక్కసారి అలా  కనుల ముందర కదులాడింది నాటి దృశ్యం

 

అప్పటివరకు  కలసి వున్నబాలసన్యాసులు ……..వేరు వేరు

రహదారుల వెంబడి  పయనమైపోయిన  క్షణం

ఆనాటి  సన్యాసులే  నేడు కళ్ళ  ముందు  కదులాడుతున్న  దృశ్యం

 

ఒక్కొక్కరిని  పోల్చుకుందామా  

అప్పట్లో  పేర్లు షార్ట్ కట్ లో పాపులర్ …..ఆంగ్లపు పొడి పొడి  అక్షరాల్లో లేదంటే ఇంటిపేరు
టి కే బి ; గుంటుపల్లి ; డి యల్ యమ్ ఆర్   ఇలా......   

 

ఇంతటి తెల్లని దీపపుకాంతిలో  కూడా నిగనిగలాడుతున్న నల్లని నగుమోమువాడు

పరిమి  (పేరు  బత్తుల గంగాధరమైన పరిమోడిగానే  ప్రసిద్ది ..పెద పరిమి వీడి ఊరి పేరు )

ఇప్పుడు  డ్రిల్లు  పంతులు  (అప్పట్లో  మంచి  ఖోఖో  ఆటగాడు  లెండి అంతకన్నా పెద్ద పోకిరి )

 

మత్తు వదలరా నిదుర మత్తు వదలరా అంటూ శ్రావ్యం గా  నిదురులేపబోతే

 ఎవడురా వాడేవడురా  నన్ను నిదురలేపే దమ్ములెవడికి  వచ్చేరా  అంటూ

భీకరంగా బూతులు పలికే  భాను ప్రకాశం కదా  వీడు

 

అన్నం ……..అప్పుడు ఎంతగా వుడికించినా వుడకని గింజ

కాని ఇప్పుడు అనేక  గింజలను వుడికిస్తున్న  ఓ  జ్ఞానదీపం

(అన్నం శ్రీనివాసరావు ……..అందరు అన్నం  అన్నం అనేవారు …….పాపం  వుడుక్కునేవాడు

ఇదేం  ఇంటిపెరురా  అని

కాని ఇప్పుడు ………..ఇన్నేళ్ళ తరువాత మరలా ఆ పిలుపు విని చెవులలో అమృత వర్షం కురిసిన  భావన

చదువులో బాగా వెనుకబడి ఉండేవాడు ………కాని జీవిత పాటాలు బాగా వంటపట్టిన తరువాత  తనను తాను సంస్కరించుకుని లెక్చరర్ అయ్యాడు )

 

ఇలా చెప్పుకుంటూపొతే  చాలా చిరాకేస్తుంది చదివేవాళ్ళకు

 

ఇలా  నాటి  స్నేహితులు సుమారు 20 మంది  ఒక చోట చేరి గంతులేస్తుంటే

 స్నేహితుడా  స్నేహితుడా  చిన్ననాటి స్నేహితుడా

అని  పాడుకుంటూ

చెప్పాల్సింది ఇంకావుంది కాని నాకే చెప్పే ఓపిక లేదు ప్రస్తుతానికి
ఇక నా గురించి మీరడగరాదు      నే చెప్పరాదు
 


--
OM NAMO BHAGAVATE VAASUDEVAAYA


Monday, January 4, 2010

ఏమి జరుగుతుందిక్కడ …………అసలేం జరుగుతుంది


ఆదివారం …జనవరి  3,2010 తెల్లవారుజాము   5.00 గంటలు

హయత్ నగర్  

ఆదివారమంటేనే కొంచెం బద్ధకం మనసును  ఆవరిస్తుంది

అల్లాంటిది చలిపులి బయట గర్జిస్తుంటే

దుప్పటి ముసుగులో వెచ్చని రక్షణకోరుకునే దేహం అంత తేలికగా

ఎలా బయటకు వస్తుంది

 

అటుదొర్లి ఇటుదొర్లి ముడుచుకుని మొత్తం మీద లే లేరా వెధవాయ్ అంటూ

మనసు పెడుతున్న ఘోషకు పుల్ స్టాప్  పెట్టేసి చక చకా స్నానాది  కార్యక్రమాలు ముగించుకుని  ,
 చల్లబడుతున్న దేహానికి అరచేతుల రాపిడిలో పుట్టిన వేడిమి

అందిస్తూ ………బస్ స్టాండ్ చేరుకొని అప్పటికే కదలటానికి సిద్దం గా వున్న  విజయవాడ

 బస్ ఎక్కి కూర్చున్న

  

 చలికాలపు ఉదయం ఎక్కడికీ అత్యవసర పయనం

 శీతల పవనాలు వణుకు పుట్టిస్తుంటే మనసులో బ్రమిస్తున్న ఆలోచనాతరంగాలు

కాల చక్రాన్ని కొన్ని యేండ్ల వెనుకకు పరిగేట్టిస్తుంది

 

కొన్ని  సంగతులు …………. మనసు  పొరల మరుగున పడిపోయిన కొన్ని

సంగతులు గుర్తుకొస్తున్నాయి

 ఎప్పుడో  20 సంవత్సరాలకు ముందున్న  6 వసంతాల కాలంలో  (1985 to 1990)

పుష్పించిన స్నేహ కుసుమాలను ఏరికుర్చుకునే ప్రయత్నం ఇన్నేళ్ళ తరువాత

చేయటం  ….కడు విచిత్రం

 ఆ  కుసుమాలు మరుగున పడినప్పటికీ వడలకపోవటం బహు విచిత్రం

 అలా ఆలోచనలలో మునిగివున్న మనసు కాలచక్రం పరుగెడుతున్న వేగంలో

బస్సు చక్రాన్ని పరుగేట్టించని వాహనచోదకుడిని తిట్టుకుంటూ చుట్టుపరికించి

చూసేసరికి విజయవాడ సరిహద్దుకు చేరుకున్నాం అప్పటికి సమయం మధ్యాహ్నం 12 గంటలు

 హమ్మయ్య ….ఇంకో గంటలో గుంటూరు కు చేరుకుంటాం

గుంటూరు …………..నాకెంతో ప్రియమైన వూరు

నా జన్మస్తలం వున్న జిల్లాగానే కాక , నా జీవనగమనంలో అధిక కాలం గడిపిన వూరు …….గుంటూరు  

 మనం ఎదురుచూస్తున్న ఘడియ రాబోతుందని మురిసే సమయానికే వెంచేస్తాయి వూహించని మలుపులు

 అప్పటిదాకా పరుగెడుతున్న బస్సుచక్రం ఒక్కసారిగా ఆగిపోయింది .ఇంకా 10 కి  మీ

దూరం వుంది . కనుచూపుకు అందనంత దూరం నుండే వాహనాలు నిలిచిపోయివున్నాయి

 

వెంటనే గుర్తుకు వచ్చాడు  మన్మధుడు

సోనాలి బెంద్రే  కోసం నాగార్జున పరుగెత్తిన విధమే ఇప్పుడు మన ముందున్న మార్గం  

 

ఆటోలు తిరిగే ఆవకాశం లేదు . ఎడ్ల బండ్లు సినిమాలకే పరిమితం

ఈదుదామంటే కాలువ లేదు …మనకు ఈత రాదు

మిగిలింది కాలి నడక

వాహనాల బారులను దాటుకుంటూ నారాయణా నాకేమిటీ పరీచ్చ అనుకుంటూ నడుస్తున్నంతలో  బహుశా  నా  ప్రశ్నకు  బదులివ్వ  దలచాడేమో  , ఒక యువకుడు నవ్వుకుంటూ నా పక్కన నిలిచి తన మోపెడ్ మీద చోటిచ్చి చిట్టినగర్ లో దించాడు  

 (మనకు  ఎటువంటి సమస్య ఎదురైనా అందుకు ఇతరులనో లేక మనలనో  నిందించుకోకుండా  

ఆ  నిందేదో నారాయణుడిపై మోపి అంతా మంచే జరుగుతుందని పదే పదే చెప్పుకుంటే

ఆ సమస్య ఖచ్చితంగా  60% పరిష్కారమవుతుంది మనకు  మానసిక వత్తిడి తగ్గుతుంది )

 సరే  అక్కడినుండి గుంటూరు చేరుకొని మన  పయనపు ఆఖరి మజిలి చేరుకునే సరికి

సరిగ్గా 2 గంటలు

 సుకుమారి నుదుటి మీద సింధూరం లా చక్కని పేరు  హోటల్  సింధూరి

 

చిన్నగా తలుపు తెరచి చూస్తే

 

ఏమి జరుగుతుందిక్కడ …………అసలేం  జరుగుతుంది

 

తరువాత  చెప్పుకుందాం ………కాసేపు  

 

విశ్రాంతి


--
OM NAMO BHAGAVATE VAASUDEVAAYA