Monday, January 19, 2026

శ్యామలా నవరాత్రులు

 ఉత్తరతస్తస్య మహా-

-నుద్భటహుతభుక్శిఖారుణమయూఖః ।

తపనీయఖండరచిత

-స్తనుతాదాయుష్యమష్టమో వరణః ॥ 

వెండి ప్రాకారానికి పైభాగాన మహోజ్వలమైనట్టి అగ్ని జ్వాలల వలె అరుణవర్ణంతో  పసుపు ఎరుపు కలసిన

ప్రకాశమానమైన కాంతులతో సూర్యుని (తపనీయ ఖండం)వలే తెల్లని కాంతులతో నిండిన ఆ ఆవరణయొక్క 

అష్టమ ప్రాకారం బంగారంతో నిర్మితమై ధ్యానించు వారలకు ఆయుష్షు పెంపొందించుచున్నది


కాదంబవిపినవాటీ-

-మనయోర్మధ్యభువి కల్పితావాసామ్ ।

కలయామి సూనకోరక-

-కందలితామోదతుందిలసమీరామ్ ॥ 

 వెండి బంగారు ప్రాకారాల నడుమ నున్న భూమి లో కదంబ వృక్షాల వనమున్నది . ఆ వనం బంగారు కాంతులతో 

ఆహ్లదకరమైన మృదువైన చల్లని గాలులతో నిండివున్నది

కదంబవనం దివ్యమైనట్టిది కదంబవృక్షం యొక్క ధ్యానం జ్ఞానాన్ని ఇస్తుంది 

అందుకే జ్ఞాన ప్రధాత గురువగు దక్షిణామూర్తి కదంబ వనంలో మర్రి చెట్టుక్రింద 

జ్ఞానముద్రలో వుంటారు . లలితా స‌హస్రం లో అమ్మవారిని కదంబవనవాసినీ అనీ కదంబకుసుమప్రియా అనీ కీర్తిస్తాం 

అంతటి దివ్యమైన ఈ వనాన్ని ధ్యానించి జ్ఞాన  సంపద పొందుదాం

కోరికలు దాటినపుడే జ్ఞానం లభిస్తుంది . అందుకే కోరికలు తీర్చే కల్పవృక్షవనాలు దాటిన తదుపరి జ్ఞాన సంపన్నమైన

 కడిమి చెట్లవనంలోకి అడుగుపెట్టాం 


తస్యామతిశిశిరాకృతి-

-రాసీనస్తపతపస్యలక్ష్మీభ్యామ్ ।

శివమనిశం కురుతాన్మే

శిశిరర్తుః సతతశీతలదిగంతః ॥ 

ఆ కదంబవనంలో తపశ్రీ  తపస్యశ్రీ (మాఘ ఫల్గుణ లక్ష్ములు )  అనే ఇరువురు శక్తులతో కలసి ఎల్లప్పుడూ మనకు మంగళములు 

(శివం ) కలిగించునటువంటి దిక్కులన్నింటిని చల్లబరుస్తున్నటువంటి  శిశిరఋతు దేవత ఉన్నారు 

శిశిర ఋతువు మనకు మంగళములు కలిగించుటలో ఔచిత్యమేమన మాఘమాసంలోనే మంగళాకారుడగు

 మహాదేవుని లింగోద్భవం 

ఇప్పటివరకు కాల స్వరూపుడగు మహాకాలుడిని ఆ కాల విభాగమైన ఆరు ఋతు దేవతలను దర్శించాం 

ఇప్పుడు ఇక్కడ ఈ వనంలో మరొక ప్రత్యేకమైన దేవతా దర్శనం చేసుకోబోతున్నాం  

తస్యాం కదంబవాట్యాం

తత్ప్రసవామోదమిలితమధుగంధమ్ ।

సప్తావరణమనోజ్ఞం

శరణం సముపైమి మంత్రిణీశరణమ్ ॥ 28 ॥

 చక్కని పరిమళాలు కలగలసిన  బంగారు కాంతులతో ప్రకాశించు ఆ కదంబ వనంలో 

మనోజ్ఞమైన ఏడు ఆవరణలతో కూడిన మంత్రిణీదేవి గృహం ను శరణుకోరుతున్నాను 


తత్రాలయే విశాలే

తపనీయారచితతరలసోపానే ।

మాణిక్యమండపాంత-

-ర్మహితే సింహాసనే సుమణిఖచితే ॥ 29 ॥

 ఆ గృహంలో బంగారు కాంతులనుఁ వెదజల్లుతున్న మెట్ల తో కూడిన మాణిక్య మండపం వున్నది 

ఆ మండపం మీద గొప్పవైన మణులతో చేయబడిన సింహాసనం   వున్నది 

బిందుత్రిపంచకోణ-

-ద్విపనృపవసువేదదలకురేఖాఢ్యే ।

చక్రే సదా నివిష్టాం

షష్ఠ్యష్టత్రింశదక్షరేశానీమ్ ॥ 30 ॥

ఆ సింహాసనం మీద ఉన్నటువంటి ఏడు ఆవరణలు చక్రంలో అమ్మవారు సదా నివసిస్తారు 

ఆ చక్ర స్వరూపం ఎలావున్నాడంటే బిందువు ఆ బిందువు ఆధారంగా త్రికోణం , దాన్నిఆధారం చేసుకుని 

ఐదు కోణాల చక్రం , దానిని ఆధారంగా (ద్విప  అంటే యేనుగు , అష్టదిగ్గజాలు ) ఎనిమిది కోణాల చక్రం

తరువాత (నృప అంటే చక్రవర్తి ...ప్రసిద్దికెక్కి నిత్య స్మరణీయులు పదహారుగురు) పదహారు దళాల పద్మం 

తదుపరి (వసు అంటే అష్ట వసువులు వీరిలో చిన్నవాడే భీష్మ పితామహుడు) ఎనిమిది  దళాల పద్మం

తదుపరి (వేద అంటే నాలుగు వేదాలు) నాలుగు దళాల పద్మం దీనిని ఆధారంగా చేసుకుని భూపురం (కురేఖాడ్యా )

ఇది అమ్మవారి చక్రం ధ్యానం చేసుకోతగినది సంకేత అక్షరాలతో చెబుతారు యంత్రాలను బీజాలను 

అవి సద్గురువు ద్వారా మనకు అందాలి తప్ప మనం వాటిజోలికి పోరాదు . మనకు అనుకూలమైనది 

ధ్యానము భగవన్నామ స్మరణము 

అలాంటి ఆ చక్రంలో తొంభై యెనిమిది అక్షరాలతో కూడిన మంత్రాధి దేవతగా అమ్మ మంత్రిణీదేవి సంచరిస్తూవుంటుంది 


ఎవరీ మంత్రిణీదేవి 

పేరులోనే ఉంది మంత్రి అంటే బుద్ది శక్తి ద్వారా కార్యాలను నిర్వహించేవారు 

బుద్దేశ్చ లలితాదేవ్యా శ్యామలా పరమేశ్వరీ వీణాశుక లసత్పాణిం ధ్యాతా సంగీత యోగిని అంటే వీణ ను చిలుకను ధరించి 

లలితా దేవి యొక్క బుద్ది శక్తి నుండి ఉత్పన్నమైన పరదేవత 

అందుకే లలితా సహస్రంలో చెబుతారు అమ్మ నామం :మంత్రిణీన్యస్త రాజ్యధూః 

ఈ తల్లినే రాజశ్యామల అంటారు . ఈ తల్లే  కాళిదాసు కు ప్రత్యక్షమై మహాకవిని చేసిన జ్ఞానస్వరూపిణి 

ఈ తల్లిని కీర్తిస్తూ మహాకవి కాళిదాసు ఆ తల్లి వున్న నివాసప్రాంతాన్ని అద్భుతంగా వర్ణిస్తారు 

జయజనని సుధా సముద్రాంతరుద్యన్ మణిద్వీప సంరూఢ

 బిల్వాటవీమధ్య కల్పద్రుమా కల్ప కాదంబ కాంతార

వాసప్రియే కృత్తివాసఃప్రియే సర్వలోకప్రియే     


అట్టి ఆ తల్లి యొక్క దివ్యమైన రూపాన్ని వర్ణిస్తున్నారు దూర్వాస మహర్షి . మనం నిత్యం ధ్యానించుకోవటానికి 

వీలుగా . విశేషించి మాఘ శుక్ల పాడ్యమి నుండి నవమి వరకు శ్యామలా నవరాత్రులు గా ప్రసిద్ధి . ఆ సమయంలో

అమ్మవారిని పదహారు నామాలతో స్మరిస్తూ ఈ విధంగా ధ్యానం చేసుకుంటే పిల్లలు పెద్దలు జ్ఞాన సంపన్నులవుతారు 

తాపింఛమేచకాభాం

తాలీదలఘటితకర్ణతాటంకామ్ ।

తాంబూలపూరితముఖీం

తామ్రాధరబింబదృష్టదరహాసామ్ ॥ 


కుంకుమపంకిలదేహాం

కువలయజీవాతుశావకవతంసామ్ ।

కోకనదశోణచరణాం

కోకిలనిక్వాణకోమలాలాపామ్ ॥ 


వామాంగగలితచూలీం

వనమాల్యకదంబమాలికాభరణామ్ ।

ముక్తాలలంతికాంచిత

ముగ్ధాలికమిలితచిత్రకోదారామ్ ॥


కరవిధృతకీరశావక-

-కలనినదవ్యక్తనిఖిలనిగమార్థామ్ ।

వామకుచసంగివీణావాదన-

-సౌఖ్యార్ధమీలితాక్షియుగామ్ ॥


ఆపాటలాంశుకధరా-

-మాదిరసోన్మేషవాసితకటాక్షామ్ ।

ఆమ్నాయసారగులికా-

-మాద్యాం సంగీతమాతృకాం వందే ॥ 


కానుగ లేదా తమాల వృక్షం వలే నీల కాంతులు అమ్మవారి వర్ణాన్ని చెబుతున్నారు 

నల్లని వర్ణం అంటే ఆ నలుపు  దూరమునుండి చూస్తే ముదురు ఆకుపచ్చ ఎలా అనిపిస్తుంది 

అలాంటి నలుపు ఆ కాంతితో ప్రకాశిస్తూ చెవులకు బంగారు తాటి కమ్మలతో చేయబడిన ఆభరణాలు 

ధరించి తాంబూలాన్ని సేవిస్తూ ఎర్రని పెదవుల నడుమ చిరునవ్వుల వెన్నెలలు కురిపిస్తున్న తల్లికి నమస్కారము 


దేవతా స్త్రీ సమూహపు అర్చన చేత దేహమంతా అలదబడిన కుంకుమ తో ప్రకాశిస్తున్నది , బాల చంద్రుని 

శిరముపై దాల్చి వున్నది  పద్మముల వంటి పాదములు  కోకిల కువకువ లవంటి మధురమైన పలుకులతో 

కూడిన తల్లికి నమస్కారము 


ఎడమ భుజం మీదుగా ముందుకు జారవిడిచి కొప్పుతో భాసిల్లున్నది , 

వనములయందలి సువాసనాభరితములైన పూలతో కదంబ కుసుమాలతో కూడిన మాలికలు ధరించినట్టిది 

ఫాలభాగం పై లలంతిక అను ఆభరణం తో ప్రకాశించునది చెక్కిళ్ళపై చిత్రకమను అలంకరణతో వెలుగొందునది 

అగు తల్లికి నమస్కారము 


అవ్యక్తమైన మధుర ధ్వనులతో సకల వేద

 శాస్త్రాల అర్ధాన్ని పలుకుతున్నటువంటి చిలుకలను చేతి యందు 

ధరించి వీణను మీటుతూ ఆ వీణ యొక్క సుమధుర ధ్వనులను ఆస్వాదిస్తూ అర్ధనిమీలిత నేత్రాలతో ఆనంద 

పారవశ్యురాలైన తల్లికి నమస్కారము 


ఎర్రని వస్త్రాలు ధరించి సౌందర్య దివ్యభావనలను ప్రసరింప చేయు కనులతో , వేద శాస్త్రముల యొక్క 

సారభూతమైనట్టిది జ్ఞాన స్వరూపిణి  సంగీత విద్యకు తల్లి అయిన శ్యామలాదేవికి నమస్కారము 


ఆ తల్లి షోడశనామములు (పదహారు నామాల ప్రత్యేకత ఏమంటే , మనకు పదిహేను తిథులు అవే 

 పునరావృతమవుతూవుంటాయి వృద్ధి క్షయాలతో అలాంటి వృద్ధి క్షయాలు లేని పరమాత్మయే పదహారో 

కళ ఇది నిత్యము సత్యము.  అందుకే పరమాత్మ ని షోడశనామాలతో షోడశోపచారాలతో పూజిస్తాం )


సర్వాకాల సర్వావస్థలయందు చెప్పదగినదే భగవన్నామం . కొన్ని ప్రదేశాలలో శబ్దం బయటకు రాకుండా 

మనసుతో మననం చేసుకోవాలి అంతకు తప్ప వేరే నియమాలు అవసరం లేదు 

శ్రీకారాలు ఓంకారాలు నమఃకారాలతో నిమిత్తం లేకుండా నోరారా పలుక దగినదే భగవన్నామం 

శ్యామలా షోడశనామములు 

సంగీతయోగినీ   శ్యామా    శ్యామలా  మంత్రనాయికా 

మంత్రిణి  సచివేశీ   ప్రధానేశీ  శుకప్రియా  వీణావతి 

వైణికి   ముద్రిణి   ప్రియకప్రియా   నీపప్రియా కదంబేశీ

కదంబవనవాసినీ   సదామదా

No comments: